కాంగ్రెస్ అధ్యక్ష పదవి తిరిగి సోనియాకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ)ను గెలుపు బాటలో నడిపించిన సోనియా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ( ఎ ఐసిసి) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. అప్పటి వరకు సోనియా గాంధీ నామినేషన్ ఒక్కటే దాఖలైందని కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ ఆస్కార్ ఫెర్నాండెజ్ చెప్పారు. సోనియా గాంధీ ఎన్నికను శనివారం లాంఛనంగా ప్రకటిస్తారు.
సోనియా గాంధీ ఎన్నిక అందరూ ఊహించిందే. అధ్యక్ష పదవికి సోనియా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వంద నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ యావత్తూ ఒక తాటిపై నిలబడి సోనియా గాంధీ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. గత ఎన్నికల్లో సోనియాపై జితేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారు. యుపి ఎ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి మొట్టమొదటి సంస్థాగత ఎన్నిక ఇదే. సోనియా గాంధీ సీతారాం కేసరి నుంచి పార్టీ పగ్గాలను 1998లో తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ పేరును ప్రతిపాదిస్తూ అమేథీ లోక్సభ సభ్యుడు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా నామినేషన్ దాఖలు చేశారు.