సిగ్గుంటే మంత్రులు రాజీనామా చేయాలి: బాబు
హైదరాబాద్: ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన తర్వాత సిగ్గుంటే మంత్రులు జె.సి. దివాకర్ రెడ్డి, రఘువీరారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారంటే వారికి సిగ్గు ఎగ్గూ లేదని ఆయన అన్నారు. మహానాడులో పెనుకొండ శానససభ నియోజవర్గం ఉప ఎన్నిక తీరుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెనుకొండ ఎన్నిక ప్రజాస్వామ్యానికి ఒక సవాల్ అని, ముఠా నాయకులకు బుద్ధిచెప్తే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు.
పెనుకొండలో కాంగ్రెస్వారు భయభ్రాంతులను చేస్తున్నారని, అందుకు పులివెందులలో కూర్చుండి పథకం రచిస్తున్నారని ఆయన అన్నారు. రాక్షసప్రభుత్వం నడుస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్కు ఇక్కడ 12 సార్లు, ఢిల్లీలో మూడు సార్లు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. తనకు ఎన్నికల కమీషన్పై ఇంకా నమ్మకం ఉన్నదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఒక ఉప ఎన్నికలోనే ఇన్ని ఆఘాయిత్యాలను చేస్తోందని ఆయన అన్నారు. పెనుకొండలో మంత్రులను నియంత్రించాలని, మంత్రులపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన ఎన్నికల కమీషన్ను కోరారు. పెనుకొండలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను హతమారుస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏ త్యాగాలకైనా సిద్ధపడుతామని ఆయన చెప్పారు.