ప్రభుత్వంపై ఇక ధర్మయుద్ధమే: మంద కృష్ణమాదిగ
వరంగల్: షెడ్యూల్డ్ కులాల ( ఎస్సీ) రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రభుత్వంపై ధర్మ యుద్ధం ప్రకటిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం ఆర్పియస్) నాయకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. జూన్ 11వ తేదీ లోగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే జూన్ 11వ తేదీన జరిగే ధర్మ యుద్ధ మహాసభలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని ఆయన అన్నారు.
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయంలో ఢిల్లీకి అఖిల పక్ష బృందంగా పోదామనే ప్రతిపక్షాల మాటను పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. మంద కృష్ణమాదిగ చేపట్టిన యాత్ర ఆదివారంనాడు వరంగల్ జిల్లా పరకాలకు చేరుకుంది. ఆయన అక్కడ అంబేడ్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు.