తెలంగాణకు బిజెపి తిలోదకాలు: వెంకయ్యనాయుడు
విశాఖపట్నం: తెలంగాణ తమ ఎజెండాలో లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా చేసిన కాకినాడ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో బుధవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడంలో తమ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తమ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ అభిప్రాయం కాదని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములును కించపరుస్తూ మాట్లాడే స్థాయి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె. చంద్రశేఖర్ రావుకు లేదని ఆయన అన్నారు. ఆలయాల భూములను విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేపడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.