తుపాకీ గొట్టం రాజ్యాధికారం తేదు: వైయస్
హైదరాబాద్: తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని మావోయిస్టులు గుర్తించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. డాక్టర్ కేశవరావు శాంతి యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లోని చార్మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రెండు మూడు దశాబ్దాలు మావోయిస్టులు పోరాటం సాధించినా అంతిమంగా శాంతి విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో శాంతి ద్వారా తప్ప మరే మార్గంలో ప్రగతిని సాధించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు.
సమాజంలో పెచ్చరిల్లుతున్న హింసాప్రవృత్తిపై చర్చ జరగాలన్నదే తన శాంతి సందేశ్ యాత్ర ప్రధాన ఉద్దేశమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. అవినీతిని అంతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. కేశవరావు బుధవారంనాడు హైదరాబాద్లో శాంతి సందేశ్ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శాసనసభ వద్ద ప్రారంభించారు.
అనంతరం యాత్ర నగరంలోని వివిధ కూడళ్ల నుంచి చార్మినార్కు చేరుకుంది. అనంతరం చార్మినార్ వద్ద బహిరంగ సభ జరిగింది. శాంతి యాత్రలో కేశవరావుతో పాటు ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు మార్గరెట్ ఆల్వా, ఆస్కార్ ఫెర్నాండెజ్, ముఖుల్ వాస్నిక్లు కూడా యాత్రలో పాల్గొన్నారు.