సంతతి పెంచండి: హిందువులకు విహెచ్పి పిలుపు
హరిద్వార్: హిందువులు తమ సంతతిని పెంచాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) పిలుపునిచ్చింది. దేశంలో ముస్లిం జనాభా పెరుగదల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దాన్ని ఎదుర్కోవడానికి హిందువులు తమ జనాభాను పెంచాలని విహెచ్పి పిలుపునిచ్చింది. అత్యున్నత నిర్ణాయక సంస్థ కేంద్రీయ మార్గ దర్శక సమావేశంలో విహెచ్పి ఆ మేరకు ఒక తీర్మానం చేసింది. తన హిందూ ఎజెండాకు విహెచ్పి మరిన్ని అంశాలను చేర్చింది. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని విహెచ్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అత్యధిక జనాభా గల సమాజం ప్రపంచంపై అత్యధిక ప్రభావం చూపుతుందని, జనాభా పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందనేది భ్రమ మాత్రమేనని జుంకా ఆఖారా ఛీప్ స్వామి అవధేశానంద మీడియా ప్రతినిధులతో అన్నారు. జనాబా అసమతుల్యతపై సమావేశంలో చేసిన తీర్మానం గురించి ఆయన వివరించారు. ముస్లిం జనాభా ముందుకు తెస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి హిందూ సమాజం పెరుగుదలకు నిర్మాణాత్మక కృషి చేయాలని సమావేశం హిందువులకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ముస్లిం జనాభా 36 శాతం పెరగగా, హిందూ జనాభా 20 శాతం మాత్రమే పెరిగిందని తీర్మానంలో తెలియజేశారు.