పోలీసుల తీరు మారాలి: వైయస్ సూచన
హైదరాబాద్: పోలీసుల తీరు మారాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ మారడం అవసరమని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ఉత్తర మండలం డిసిపి కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయని, కేసులను నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని ఆయన అన్నారు. కేసులు ఎక్కువ నమోదైతే ఇబ్బంది ఎదురువుతోందని ఉద్దేశంతో కేసులు నమోదు చేయడం లేదని తెలుస్తోందని, అయితే కేసులు నమోదు చేసి పరిష్కారం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని ఆయన అన్నారు.
పోలీసు వ్యవస్థలో పారదర్శకత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వీటి వల్ల మధ్యతరగతి, పేద ప్రజలు బాధలకు గురవుతున్నారని ఆయన చెప్పారు. అట్టడుగు స్థాయి ప్రజలకు అండగా పోలీసు వ్యవస్థ నిలబడాలని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యపై సకాలంలో పోలీసులు ప్రతిస్పందించడం అవసరమని ఆయన అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో జరిమానాలు ఎక్కువగా విధించకుండా ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి కె. జానారెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిసిసి) స్వరణ్జిత్ సేన్, తదితరులు పాల్గొన్నారు.