ఆర్టీసి చర్చలు విఫలం: సమ్మె యధాతథం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) యాజమాన్యానికి, కార్మిక నేతలకు మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన సమ్మె అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
సమ్మె నష్టదాయకమని ఆర్టీసి యాజమాన్యం అంటుండగా సంస్థ పరిరక్షణకే తాము సమ్మె చేస్తున్నామని ఐక్య కార్యాచరణ సమితి నాయకులంటున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ సయ్యద్ మహమూద్ ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధర పెంపు వల్ల ఆర్టీసిపై మరో 130 కోట్ల భారం పడుతుందని ఆయన చెప్పారు. ఆర్టీసి యాజమాన్యం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారావు, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమ్మెకు అన్ని గ్రేడ్ల సూపర్వైజర్ల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సంఘాలు కూడా సమ్మె నోటీసులు ఇచ్చాయి.