6 నెలల్లో తెస్తామంటే మేం తగ్గుతాం: టిఆర్యస్
వరంగల్: మావోయిస్టులు ఆరు నెలల్లోగా తెలంగాణను సాధిస్తామంటే తాము వెనక్కి తగ్గుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి విజయరామారావు అన్నారు. తాము మావోయిస్టుల సానుభూతి పరులమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పుకున్నారు. మావోయిస్టులు తమపై దాడులు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం పోరాడుతామని మావోయిస్టులు చెప్తే తాము పదవుల నుంచి తప్పుకుంటామని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని, అదే పద్దతిలో తాము తెలంగాణను సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ సాధనకు ఢిల్లీలో తమ నేతలు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. తమ పట్ల తీసుకున్న వైఖరిపై మావోయిస్టులు పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు. తాము చేయరాని తప్పు ఏదీ చేయలేదని, తాము శిక్షార్హులం కాదని ఆయన అన్నారు. మావోయిస్టులు తెలంగాణను వారి పద్ధతిలో ఆరు నెలల్లోగా సాధిస్తామంటే తాము ఉద్యమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఫిర్యాదు చేసింది మొదట తామేనని, అవసరమైతే సంబంధిత శాఖలను సంప్రదిస్తామని ఆయన చెప్పారు.