చంపదల్చుకుంటే నన్ను చంపండి: నక్సల్స్తో కెసిఆర్
న్యూఢిల్లీ: చంపదలుచుకుంటే తనను చంపాలని, తమ పార్టీ దిగువ స్థాయి కార్యకర్తలను చంపవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధన విషయంలో తమ కృషి పట్ల అపోహలు అవసరం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు. తమ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధన మాత్రమేనని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా లేదని బయట పడిన మరుక్షణం తాము పదవులను వదులుకుని మరో మహత్తర ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము కృషిని ఆయన వివరించారు.
తమ పార్టీ కార్యకర్తలను, దిగువ స్థాయి నాయకులను చంపాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కెసిఆర్ నక్సల్స్ను కోరారు. తెలంగాణపై కాంగ్రెస్ వెనుకడుగు వేసిన నాడు తాము తమ పదవులను గడ్డిపోచల్లా వదలుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది వెలువరించాల్సిన రాజకీయ నిర్ణయమని, దీనికి తాము ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టామని, ఈ మద్దతుతో తాము ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు విశ్రమించబోమని ఆయన హామీ ఇచ్చారు. గత యాబై ఏళ్లలో ఇంతగా తెలంగాణకు మద్దతు లభించిన సందర్భాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు కారనివ్వమని, గమ్యం చేరే వరకు ఉద్యమిస్తామని, తన మాట మీద నమ్మకం ఉంచాలని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో తీర్మానం చేయడం తప్ప మరో మార్గం లేదని, అందుకు తాము దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టామని ఆయన చెప్పారు. ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని, ఒత్తిళ్లకు గురి చేయవలసిన సమయం కాదని ఆయన అన్నారు. చిన్న చిన్న కారణాలతో, నెపాలతో అపోహలు పెంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఈ విజ్ఞప్తిని వ్యక్తిగతంగా చేయడం లేదని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరఫున చేస్తున్నానని ఆయన అన్నారు.