ఆర్టీసి ఛార్జీలు పెరగవు: మంత్రి సంతోష్ రెడ్డి
నిజామాబాద్: డీజిల్ ధర పెరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) బస్సుల చార్జీలు పెంచే ఆలోచన లేదని రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో ఆయన గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన ఆర్టీసి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మెను విరమించుకోవాలని ఆయన అన్నారు.
సమ్మెను మొండి వైఖరితో ఆణచివేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యంలో కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉందని, అయితే పరిస్థితులను అర్థం చేసుకోవాలని మాత్రమే తాము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. కార్మికుల డిమాండ్లను దాదాపు అన్నింటినీ తాము అంగీకరించామని ఆయన చెప్పారు. డీజిల్పై అమ్మకం పన్నును ఉపసంహరించుకోవాలనే డిమాండ్ను మాత్రమే తాము అంగీకరించలేదని, ఒకేసారి అన్నీ ఒప్పుకుంటే ప్రభుత్వంపై తీవ్రమైన భారం పడుతుందని, దీన్ని ఆలోచించడం అవసరమని ఆయన అన్నారు. ఈ డిమాండ్ను కూడా తాము నిరాకరించలేదని, కేవలం వాయిదా వేశామని ఆయన చెప్పారు.