జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభం
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు గురువారం తమ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అత్యవసర సర్వీసులను వారు సమ్మె నుంచి మినహాయించారు. ఈ సమ్మెతో ప్రభుత్వాస్పత్రుల్లోని రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం అంటోంది. ఉన్న వైద్యులతో ఎక్కువ సమయం పని చేయించడంతో పాటు బయటి నుంచి వైద్యులను రప్పించి రోగులకు ఇబ్బంది కలగుకుండా చూస్తున్నామని చెబుతోంది. జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో దాదాపు 150 మంది జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాస్పత్రిలో విధులకు గైర్హాజరయ్యారు. విశాఖపట్నంలోని కెజిహెచ్ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, వైద్య కళశాలల్లోని బోధనా సిబ్బంది సంఖ్యను వెల్లడించాలని, ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని, యూజర్ ఛార్జీలను వసూలు చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.