జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సోమవారం వ్యవసాయం శాఖ మంత్రి రఘువీరారెడ్డితో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తి లేదని రఘువీరా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం మెట్టు దిగాల్సిందేనని అంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారి ఆందోళన మంగళవారంనాటికి ఆరో రోజుకు చేరుకుంది.
హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు మౌనప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ బెదిరింపులకు తాము తలొగ్గబోమని వారన్నారు. విశాఖపట్నంలో కూడా జూనియర్ డాక్టర్లు మౌనప్రదర్శన నిర్వహించారు. కింగ్జార్జి ఆస్పత్రిపై ఈ ఆందోళన ప్రభావం పడింది. విజయవాడలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి పెళ్లి చేశారు. చంద్రబాబు బాటలోనే వైయస్ నడుస్తున్నారని, దొందూ దొందేనని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. గుంటూరులో ఆందోళనకారులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. సర్వమత ప్రార్థనలు చేసి, మసీదు, గుడి, చర్చిలలో వినతిపత్రాలు సమర్పించారు.