బిజెపి కార్యవర్గ సమావేశానికి అసమ్మతి బ్రేక్లు
న్యూఢిల్లీ: అసమ్మతి సెగలతో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒత్తిడితో భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. మాజీ ప్రధాని వాజ్పేయి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి అధికార ప్రతినిధి వి.కె. మల్హోత్రా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు చెన్నైలో తలపెట్టిన కార్యవర్గ సమావేశాన్ని సెప్టెంబర్ నెలకు వాయిదా వేయాలని బిజెపి సోమవారం ఉదయం నిర్ణయించింది. సెప్టెంబర్లో ఏ తేదీల్లో జరిగేది ఇంకా నిర్ణయించలేదు.
పార్టీ అధ్యక్ష పదవిలో ఎల్. కె. అద్వానీ కొనసాగడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్యస్యస్) విభేదించడం, పార్టీ నేత ఖురానా విమర్శ చేయడం వంటి కారణాల వల్ల బిజెపి కార్యవర్గ సమావేశం వాయిదా పడినట్లు భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే బిజెపి కార్యవర్గ సమావేశం జరగాలని ఆర్యస్యస్ పట్టుబడుతోంది.