అయోధ్యలో భారీ బందోబస్తు: ఢిల్లీలో వీరంగం
అయోధ్య: రామజన్మభూమి సముదాయంపై తీవ్రవాదుల దాడికి నిరసనగా బిజెపి, విహెచ్పి తలపెట్టిన బంద్ సందర్భంగా అయోధ్య, ఫైజాబాద్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలేవీ జరగకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు పెంచారు. బంద్ మిశ్రమ స్పందన లభించింది. దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు చాలా వరకు తెరిచే వుంచారు. అయితే ఉద్యోగుల హాజరు పల్చగా ఉంది.
దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఏమీ తగ్గలేదు. ప్రధానమైన దేవాలయాల్లో భక్తుల రద్దీగా గణనీయంగానే ఉంది. దాడి తర్వాత మూసేసిన రామ్లల్లా దేవాలయాన్ని బుధవారం తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విహెచ్పి కార్యకర్తలు అయోధ్యలోని సందుల్లో తిరుగుతూ దుకాణాలను మూసేయించడం కనిపించింది.
ముంబాయికి బయలుదేరిన విమానాన్ని బిజెపి, విహెచ్పి కార్యకర్తలు ఇండోర్ విమానాశ్రయంలో ఆపేశారు. విహెచ్పి కార్యకర్తలు వి ఐపి లాంజ్ను ధ్వంసం చేసి విమానాశ్రయం ఆవరణలోకి దూసుకెళ్లారు. దీంతో ఆ విమానం ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆందోళనకారులను చెదరగొట్టి విమానాన్ని బయలుదేరదీశారు. ఇండోర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు.
బిజెపి, విహెచ్పి కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విహెచ్పి, బిజెపి కార్యకర్తల నిరసన హింసకు దారి తీసింది. వందలాది ఆందోళనకారులు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ వదిలారు. అనంతరం వి.కె. మల్హోత్ర, సుష్మా స్వరాజ్, మదన్లాల్ ఖురానా, తదితర బిజెపి నాయకులు అరెస్టయ్యారు.