ఆర్టీసి సమ్మె వాయిదా, విరమణ కాదు
హైదరాబాద్: సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జె ఎసి) నాయకులు ప్రకటించారు. సమ్మెను విరమించాలని హైకోర్టు చేసిన సూచనపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం జె ఎసి నాయకులు బుధవారం సాయంత్రం ఆ విషయాన్ని ప్రకటించారు. హైకోర్టు తమకు ఇచ్చిన హామీ మేరకు 21 రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, రేపు ఉదయం 9 గంటలకు చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించింది. హైకోర్టు సూచనలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
బుధవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసి సమ్మె విరమణ విషయంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సమ్మెను విరమించుకుంటున్నట్లు హైకోర్టుకు ఆర్టీసి కార్మిక సంఘాల తరఫు న్యాయవాది చెప్పగా, తమ డిమాండ్లపై హైకోర్టు రాతపూర్వకమైన హామీ ఇస్తేనే సమ్మె విరమించుకుంటామని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. తాజా పరిస్థితిని చర్చించేందుకు కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. తమ నిర్ణయాన్ని సాయంత్రం ఐదు గంటలకు వెల్లడిస్తామని వారు చెప్పారు.
హైకోర్టు ముందు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది నాలుగు డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వం ఆర్టీసికి 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, సమ్మెకు దిగిన కార్మికులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దని ఆ డిమాండ్లలో ఉన్నాయి. సమ్మె విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాల తరఫు న్యాయవాది మీడియా ప్రతినిధులతో కూడా చెప్పారు.
హైకోర్టు సూచనలను ప్రభుత్వం అంగీకరిస్తుందని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. హైకోర్టు సూచనల మేరకు కార్మిక సంఘాల నాయకులతో చర్చిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.