తెలంగాణపై రేపు ప్రణబ్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: తెలంగాణపై ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ఉపసంఘం రేపు (గురువారం) సాయంత్రం సమావేశమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఒత్తిడి మేరకు ఈ సమావేశంలో జరుగుతోంది. తెలంగాణపై తమ తమ వాదనలు వినిపించాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇదివరకే వివిధ రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
తెలంగాణపై తమ వాదనలు వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందజేసేందుకు 8 పేజీల నోట్ను తయారు చేసినట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కె. ఎర్రంనాయుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. సమైక్యాంధ్రలోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని వారు చెప్పారు. రాష్ట్రం ముక్కలుగా విడిపోతే అభివృద్ధి జరగదని వారన్నారు. పదవీ వ్యామోహంతో రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి సిద్ధపడుతున్నారని వారు విమర్శించారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి స్నేహాన్ని కూడా వారు తప్పు పట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించబోమని సిపియం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు.