తెలంగాణ నిర్ణయం కేంద్ర పార్టీ వద్ద ఉంది: బిజెపి
విశాఖపట్నం: తెలంగాణపై తమ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు హరిబాబు అన్నారు. తాము 1997లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాకినాడలో తీర్మానాన్ని చేసి కేంద్ర పార్టీ ఆమోదం కోసం పంపామని, కేంద్ర పార్టీ దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి చెన్నైలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ నాయకులు చర్చకు తీసుకువస్తేనే తెలంగాణపై తాము మాట్లాడుతామని ఆయన చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై తమ పార్టీలో విభేదాలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసి గెలిచాయని, ఈ సందర్భంగా ఈ పార్టీలు ప్రజలకు ఏం చెప్పాయో ఎవరికీ అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అదే అయోమయం టి ఆర్యస్లో నెలకొందని, ఆ అయోమయమే టి ఆర్యస్ మంత్రుల రాజీనామాకు దారి తీసిందని ఆయన అన్నారు. ఏ ప్రాతిపదిక మీద కాంగ్రెస్, టి ఆర్యస్లు పొత్తు పెట్టుకున్నాయో వెల్లడించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. దీని గురించి టి ఆర్యస్ ఈ నెల 18వ తేదీన వరంగల్లో చెప్తామని అంటోందని, అప్పటి వరకు వేచి చూద్దామని ఆయన అన్నారు.