టిఆర్యస్ మాటలు అసంబద్ధం: పిన్నమనేని
విజయవాడ: కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న ప్రకటనలను రాష్ట్ర ఉన్నతా విద్యామంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. ఆయన ఆదివారంనాడు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా డెల్టాకు నీటి విడుదలను సమీక్షించారు. కృష్ణా జలాలపై కృష్ణా డెల్టాకే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. నీటి నిల్వ పరిస్థితి సరిగా లేకున్నా నీటిని విడుదల చేయించారని, అలా ఎందుకు చేశారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గడువు కన్నా ముందే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మున్నేరు వాగు పొంగి పొర్లుతుండడంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది.