వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో అక్రమాలు లేవు: బొత్సా
హైదరాబాద్: విశాఖపట్నంలో వోక్స్ వ్యాగన్ పరిశ్రమను నెలకొల్పేందుకు జరుగుతున్న వ్యవహారాల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. వోక్స్ వ్యాగన పరిశ్రమ రాష్ట్రానికి వస్తుందనే నమ్మకం తనకు ఇప్పటికీ ఉందని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ పరిశ్రమ స్థాపన కోసం జరుగుతన్న వ్యవహారాల్లో భారీ అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణల వెల్లువపై ఆయన మంగళవారం సచివాయలంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మీడియాకు తగదని, తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.
వశిష్ట వాహన కంపెనీకి వోక్స్ వ్యాగన్ చెప్పడం వల్లనే 11 కోట్ల రూపాయల డిపాజిట్ చెల్లించామని ఆయన చెప్పారు. వశిష్ట వాహన కంపెనీ రిజిష్టర్ ఆఫీసు ఎక్కడుందో తనకు తెలియదని, వశిష్ట వాహన కంపెనీ ప్రతినిధులను తనకు వార్త దినపత్రిక అధిపతి గిరీష్ సంఘీ పరిచయం చేశారని ఆయన చెప్పారు. వశిష్ట వాహన కంపెనీ వివరాలు తెలుసుకునే బాధ్యత తమది కాదని ఆయన అన్నారు. వశిష్ట కంపెనీ ప్రతినిధులతో తనకు వ్యక్తిగత సంబంధం లేదని ఆయన అన్నారు. వశిష్ట కంపెనీ తమదేనని వోక్స్ వ్యాగన్ లిఖితపూర్వకంగా తెలియజేసిందని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమల కమీషనర్ నేతృత్వంలో ఒక బృందాన్ని దర్యాప్తునకు జర్మనీ పంపుతామని ఆయన చెప్పారు. తమకు ఒక నెల సమయం ఇవ్వాలని, వోక్స్ వ్యాగన్ కంపెనీ రాష్ట్రంలో ఇంకా పరిశ్రమను స్థాపించే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. తాము అన్నిటికీ వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దయచేసి ఆరోపణలు చేయవద్దని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రతినిధులకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా విందులిచ్చారని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్తో తొలుత చర్చలు జరిపింది గత తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన అన్నారు.