ఎవరైనా కలవొచ్చు: కెసిఆర్తో భేటీపై వైయస్
హైదరాబాద్: తనను ఎవరైనా కలవవచ్చునని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తనతో తన సమావేశం ఏర్పాటు హామీ ఇవ్వడంపై ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. ఢిల్లీకిలో కెసి ఆర్తో మీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా తనకు ఆ విషయం తెలియదని, అయినా తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఎవరినైనా కలుస్తానని ఆయన అన్నారు. కెసి ఆర్ ఇంతకు ముందు సోనియా గాంధీపై, ఇప్పుడు మీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు, ఆయన పద్ధతేమిటని ఒక విలేకరి అడగ్గా ప్రతి దానికీ నేను సమాధానం చెప్పాలా, ఆ పద్ధతి ఏమిటో మీరు చెప్పండి అని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రుల రాజీనామాలపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. రవాణా మంత్రి సంతోష్ రెడ్డిని మీరు మేనేజ్ చేశారని అంటున్నారని అంటే తనకు మేనేజ్ చేయవలసిన అవసరం లేదని ఆయన సమాధానమిచ్చారు. మీరే రాస్తారు, మీరే అడుగుతారు. మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముందనేది విశ్లేషించరు అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. కెసి ఆర్తో ఏం మాట్లాడుతారని అడిగితే మాట్లాడిప్పుడు ఏం మాట్లాడుతామో తెలుస్తుందని ఆయన అన్నారు.
తాను ఒప్పుకోలేని డిమాండ్లు పెట్టామని నరేంద్రనే చెప్తున్నారు కదా అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. గోబెల్స్ ప్రచారం అంటే ఏమిటండి? తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పడం కదా! నా మీద తప్పుడు సమాచారం పదే పదే చెప్పుమని ఆయన (నరేంద్ర) తన కార్యకర్తలకు చెప్తున్నారు అని ఆయన అన్నారు.