ఫుడ్ ప్రాసెసింగ్ బలోపేతం: వైయస్
హైదరాబాద్: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించి బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి ఒక ప్రతినిధి బృందం రాష్ట్రానికి వస్తుందని ఆయన చెప్పారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో తన పర్యటన వివరాలను అందించారు. హైదరాబాద్లో నాలెడ్జ్ పార్క్ ఏర్పాటులో పాలు పంచుకునేందుకు దుబాయ్ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సహకారం అందిస్తానని కూడా దుబాయ్ ప్రభుత్వం చెప్పిందని ఆయన చెప్పారు.
మున్సిపాలిటీల్లో మురికి నీటిని రీసైకిల్ చేసి వినియోగించుకునే కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఒక కన్సల్టెన్సీ కంపెనీని అధ్యయనం చేయాలని కోరామని, ఆ కంపెనీ ప్రతినిధులు వస్తారని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ ఏర్పాటుకు కూడా దుబాయ్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ ఏర్పాటుకు తాము కేటాయించిన 7 వేల ఎకరాలు సరిపోదని అనిపిస్తోందని, మరింత స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఏర్పడవచ్చునని ఆయన వివరించారు.
గ్రీన్హౌజెస్ మన దగ్గర ఆర్థికంగా ఉపయోగకరం కాదని, రైతుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు తెలిసినవారు కావాలని ఆయన అన్నారు. కార్పోరేట్ వ్యవసాయం ఇక్కడ అంత సులభం కాదని ఆయన అన్నారు.