అయోధ్య దాడి కేసు పురోగతి: 5గురు అరెస్టు
న్యూఢిల్లీ/ లక్నో: అయోధ్యపై ఈ నెల 5వ తేదీన జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో పోలీసులు కొంత మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ దాడి వెనక పాకిస్థాన్కు చెందిన లష్కర్ - ఎ - తోయిబా హస్తం ఉన్నట్లు తేలిందని పోలీసులు వర్గాలు చెప్పాయి. దాడికి దిగిన ఆత్మాహతి దళ సభ్యులు సింధిలో లేదా బలోచిలో మాట్లాడినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ దాడిలో పాల్గొన్నవారు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి వుండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. దీంతో జమ్మూ డివిజన్లోని మేంధార్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఐదుగురిని అరెస్టు చేయగలిగాయి. దాడి చేయడానికి మిలిటెంట్లకు ఈ ఐదుగురు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయోధ్యకు మిలిటెంట్లను, ఆయుధాలను సరఫరా చేయడానికి వాడిన రెండు టాటా సుమోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయోధ్యలో ఉగ్రవాదుల దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడి చేయడానికి మిలిటెంట్లకు మొత్తం ఎనిమిది సహకరించారని, ఇందులో ఐదుగురు తమకు చిక్కారని పోలీసులు చెప్పారు. మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అయోధ్యలో దాడికి దిగిన ఐదుగురు ఆత్మాహుతి మిలిటెంట్లలో ఇద్దరిని పోలీసులు ఇద్దరిని గుర్తించారు. వీరిలో ఒకరు యూనస్ కాగా, మరొకరు అర్షద్ అలియాస్ ఆసిఫ్ అని ఉత్తరప్రదేశ్ డిజిపి యశ్పాల్ సింగ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.