వోక్స్ వ్యాగన్పై అనవసర రాద్ధాంతం: వైయస్
తిరుపతి: వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ కోరిన తర్వాత కూడా రాద్ధాంతం చేయడం సరి కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోవడానికి సిబిఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించిన తర్వాత సంతోషించడం పోయి తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో దాచిపెట్టడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. చిత్తూరు డెయిరీ మూత పడడానికి కారణమేమిటో ఆలోచించి ఆ తర్వాత మిగతా విషయాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధినేత కె. చంద్రశేఖర్రావుతోనూ, కాంగ్రెస్ తెలంగాణ నాయకులతోనూ మాట్లాడతానని ఆయన చెప్పారు. తనతో ఎవరు మాట్లాడదలుచుకున్నా తాను సిద్ధమేనని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలో గురవారం రాజీవ్ నగరబాటను ముగించుకున్న ముఖ్యమంత్రి శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వెటర్నరీ యూనివర్శిటీకి శ్రీకారం చుట్టారు.