దోషులెవరైనా ఉరితీస్తాం: కేశవరావు
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో దోషులెవరైనా వారిని ఉరి తీస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఈ వ్యవహారంతో భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణకు గానీ మరెవరికి గానీ సంబంధం లేదని ఆయన కితాబు ఇచ్చారు. అమెరికా నుంచి గురువారం అర్థరాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారంనాడు ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత మిత్రుడు కె.వి.పి. రామచంద్రరావుతో సమావేశమయ్యారు. అనంతరం బొత్సా నారాయణతో కూడా కలిశారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించుకుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై సిబి ఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేస్తే అందుకు అంగీకరించామని, తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో దోషులెవరైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు.