రాజభవన్ను రాజకీయవేదికగా చేస్తున్నారు: దత్తాత్రేయ
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సిఫార్సు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) మంత్రుల రాజీనామాలను గవర్నర్ సుశీల్కుమార్ షిండే ఆమోదించకపోవడం అప్రజాస్వామికమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మంత్రుల రాజీనామాలను ఆమోదించకపోవడం వల్ల రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బీహార్, జార్ఖండ్, గోవాలలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ రాజకీయాలకు వేదికగా మారుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా అని ఆయన అడిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని ఆయన విమర్శించారు. చాలా మంది మంత్రులు అవినీతిలో కూరుకపోయారని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. టిఆర్యస్ మంత్రుల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై కాంగ్రెస్లోనే అసంతృప్తి ఉందని ఆయన అన్నారు.