పనులపై అధికారులదే నిర్లక్ష్యమంతా: వెంకటస్వామి
హైదరాబాద్: ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నా పనులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డితో సీనియర్ పార్టీ నేతలు సమావేశమై పలు విషయాలు మాట్లాడామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రితో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) ఆరు షరతులు పెట్టిందని, వాటిపై టి ఆర్యస్ నేత కె. చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుకుంటారని ఆయన చెప్పారు. టి ఆర్యస్ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనం తమ వెంట ఉన్నారో లేదో తెలుసుకోవడానికి టి ఆర్యస్ వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించడం కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. టి ఆర్యస్ మంత్రుల రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీలను ముఖ్యమంత్రి తన ఇష్టప్రకారం భర్తీ చేసుకుంటారని ఆయన అన్నారు.