సియం వద్దే శాఖలన్నీ మంచిది కాదు: సిపిఐ
హైదరాబాద్: మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వద్దనే ఉండడం సరికాదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అది ప్రజా సంక్షేమం దృష్ట్యా మంచిది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రుల రాజీనామాలు, క్రీడల మంత్రి ఎం. సత్యనారాయణ రావు రాజీనామా, బొత్సా సత్యనారాయణ మార్కెటింగ్ శాఖను చేపట్టకపోవడం వంటి కారణాల వల్ల రాజకీయ సంక్షోభం ఏదీ తలెత్తలేదని, అయితే ఈ పరిస్థితి ప్రభుత్వానికి ప్రతికూలతను పెంచడానికి కారణమవుతుందని ఆయన అన్నారు. టి ఆర్యస్ మం6తుల రాజీనామాలకు రాజకీయ కారణాలున్నాయని, అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎం. సత్యనారాయణ రావును, బొత్సా సత్యనారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని ఆయన అన్నారు.