తెలంగాణకు ప్యాకేజీలు కంటితుడుపు: దత్తాత్రేయ
విజయవాడ: తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అనేది కంటితుడుపు చర్య మాత్రమేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సమస్య ఎదురైనప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా గోదావరి నీటిని తెలంగాణ మెట్ట ప్రాంతాలకు అందించే కార్యక్రమం చేపట్టడం అవసరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ వెనకబడి లేదని, నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ వల్లనే ఈ నిర్లక్ష్యానికి గురైందని ఆయన అన్నారు.
తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్)కి తెలంగాణపై చిత్తశుద్ధి లేదని, కేంద్రంలో ప్రభుత్వంలో కొనసాగుతూ తెలంగాణపై ఎన్ని చెప్పినా అవన్నీ కాకమ్మ కబుర్లేనని ఆయన అన్నారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్తో టిఆర్యస్ చేతులు కలిపిందని, ఆ రకంగా టిఆర్యస్ ఎవర్ని మోసం చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు వరంగల్ సభలో ప్రకటించాలని ఆయన టిఆర్యస్ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నా టిఆర్యస్ మాట్లాడలేదని ఆయన అన్నారు.