ఎమ్మెస్సార్ నిర్ణయం మార్చుకుంటారు: వైయస్
హైదరాబాద్: క్రీడాశాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావును తాను సముదాయించానని, సత్యనారాయణరావు తన రాజీనామాను ఉపసంహరించుకుంటారని తాను ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సత్యనారాయణరావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మీడియా వార్తలకు మనస్తాపం చెంది సత్యనారాయణరావు రాజీనామా చేశారని ఆయన అన్నారు.
సత్యనారాయణరావుపై వచ్చిన వార్తలు అభూతకల్పనలని ఆయన అన్నారు. సత్యనారాయణరావు చాలా సెన్సిటివ్ అని, పెద్ద మనిషి అని, వయస్సులో తమందరి కన్నా పెద్దవారని ఆయన అన్నారు. పత్రికలు సంచలనాల కోసం వార్తలు రాస్తుంటాయని, వాటికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేవాలయ భూమలు అక్రమ విక్రయంపై వేసిన విచారణ సంఘం నివేదిక రావాల్సి ఉందని ఆయన అన్నారు. సత్యనారాయణరావుపై వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన అన్నారు. అటువంటి వార్తా కథనాలు తయారు చేసిది మీరే, అడిగేదీ మీరే, మీరే రూమర్స్ అని అంటున్నారు అని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని అంతకు సమాచార, పౌరసంబంధాల మంత్రి షబ్బీర్ అలీ అంతకు ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు.