మంత్రులందరి రాజీనామాలు: వైయస్కు సలహాలు
హైదరాబాద్: మంత్రులందరి చేత మూకుమ్మడి రాజీనామా చేయించి, మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్లోని సన్నిహితులు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. వచ్చే రెండు మూడు రోజుల్లో మంత్రివర్గానికి సంబంధించి ఏమైనా జరగవచ్చునని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఒక ప్రైవేట్ టీవీ చానల్తో వ్యాఖ్యానించడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.
ఇదిలావుంటే, ఉద్యోగుల వేతనసవరణకు సంబంధించి ముగ్గురు ఐ ఎయస్ అధికారులు రఘోత్తమరావు, రమాకాంతరెడ్డి, గోయల్లతో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ నెలలోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్రజాసమస్య పరిష్కారానికి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సిపియం నాయకులతో సంప్రదింపులకు మంత్రులు కోనేరు రంగారావు, ధర్మాన ప్రసాదరావులను ముఖ్యమంత్రి నియోగించారు.