తెరాసతో పొత్తుపై ఇంకా నిర్ణయం కాలేదు: కెకె
హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)తో పొత్తు విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. టి ఆర్యస్తో పొత్తు ఉన్నా, లేకున్నా మున్సిపల్ ఎన్నికల్లో తాము గెలుస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్థానిక నాయకత్వం ఆలోచనను బట్టి మున్పిపల్ ఎన్నికల్లో పొత్తులుండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల వైఖరిలో మార్పు వచ్చినట్లు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఐక్యప్రగతిశీల కూటమిలోని అత్యధిక పక్షాలు అంగీకరించాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ నేత శరద్పవార్ చేసిన ప్రకటనపై ప్రతిస్పందిస్తూ శరద్పవార్ అన్నంత మాత్రాన అది జరిగిపోయినట్లు కాదు కదా అని కేశవరావు అన్నారు.