రమణమూర్తి కారు స్వాధీనం: కత్తులు లభ్యం
హైదరాబాద్: టిమ్స్ అధిపతి నవీష్మూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు రమణమూర్తికి చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో ఎల్.బి. నగర్లో గల సహారా ఫంక్షన్హాల్లో పార్క్ చేసి ఉన్న ఈ కారును శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో కత్తులు, ఆయుధాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపినట్లు వారు తెలిపారు. నిపుణుల నివేదిక అందితే విలువైన సమాచారం లభించగలదని పోలీసులు భావిస్తున్నారు. నవీష్మూర్తి హత్య జరిగిన 15వ తేదీ రాత్రి నుంచి ఆ కారు అక్కడే ఉంటోందని పోలీసులు చెప్పారు. ఈ ఫంక్షన్ హాల్ కూడా రమణమూర్తిదేనని పోలీసులు చెప్పారు. రమణమూర్తి కోసం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తున్నప్పటికీ అతను హైదరాబాద్లోనే తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతను రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, రమణమూర్తి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. తిరుపతిలోని ఒక స్థావరం నుంచి రమణమూర్తి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. రమణమూర్తి మామను, పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిని హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రమణమూర్తి తిరుపతి నుంచి గుంటూరు పారిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
నవీష్మూర్తి హత్యలో విక్రమ్, అతని భార్య లీలావతి పాత్రలపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నవీష్మూర్తిని కిడ్నాప్ చేసిన హత్యాపథకాన్ని అమలు చేయడంలో విక్రమ్ ప్రధాన పాత్ర పోషించి వుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీలావతి రమణమూర్తికి చెందిన జైభారత్ సంస్థలో చురుకైన పాత్ర పోషించింది. నవీష్ ఇంటిపై దాడి చేసి ఆయనను కొట్టి అర్థనగ్నంగా ఊరేగించిన సంఘటనలో విక్రమ్, లీలావతి ప్రధాన పాత్ర పోషించారు.