10 మంది జనశక్తి నక్సలైట్ల అరెస్టు
ఒంగోలు/ వరంగల్: సిపిఐ (యంయల్) జనశక్తికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా పోలీసులు జనశక్తికి చెందని నలుగురు దళ సభ్యులతో పాటు 9 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. నెల్లూరు నుంచి కావలికి కారులో వస్తుంటే 9 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మహేష్ చంద్ర లడ్హా బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో వీరు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 29 మంది జనశక్తి సభ్యులున్నారని, జనశక్తి కార్యకలాపాలను అదుపు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా గార్లబయ్యారం జనశక్తి దళ కమాండర్ బానోతు పింపి అలియాస్ రమక్కను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా కారంపూడిలోని తండాకు తన కుటుంబ సభ్యులను చూడడానికి వెళ్తుండగా రమను పోలీసులు అరెస్టు చేశారు. రమ ప్రముఖ నక్సలైటు రమేష్ భార్య. జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్ బాడీ గార్డ్గా కూడా రమ పని చేసింది.