ముంబాయిలో వానలకు 25 మంది మృతి
ముంబాయి: ధారాపాతంగా కురుస్తున్న వర్షాలకు ముంబాయిలో 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య 30 దాకా ఉండవచ్చునని భావిస్తున్నారు. ముంబాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. గత 24 గంటలుగా ఇక్కడ వర్షం కురుస్తూనే ఉంది. బాధితుల సహాయార్థం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నావికాదళం సహాయాన్ని కూడా కోరింది.
విమానాశ్రయం రన్వే మీదికి కూడా నీరు రావడంతో విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బుధవారం సాయంత్రానికి విమానాల రాకపోకలు యథాస్థితికి చేరుకోవచ్చునని అధికారవర్గాలు భావిస్తున్నాయి. రైళ్ల రాకపోకలు కూడా గత 24 గంటలుగా స్తంభించాయి. బుధవారంనాడు రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. శివారు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఈ సాయంత్రం ప్రారంభం కావచ్చునని భావిస్తున్నారు. ముంబాయిలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఇద్దరు పిల్లలు డ్రైనేజీలో కొట్టుకుపోయారు. గోడ కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారు.