తెలంగాణలోని 4 జిల్లాల అధికారులు అప్రమత్తం
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా వాగులు, వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వచ్చే 24 గంటల పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. కోస్తా జిల్లాలో కూడా చెదురుమొదురు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి డ్యామ్ గేట్లన్నీ ఎత్తివేశారు. దీంతో గోదావరి నదిలో ఆంధ్రప్రదేశ్ వైపు నీరు దూసుకొస్తోంది. నది వైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబాయి భారీ వర్షాలతో అతలాకుతలం కావడంతో హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. విమానాలను కూడా రద్దు చేశారు. దీంతో గల్ఫ్కు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బదులకు గురవుతున్నారు.
ఆదిలాబాద్లోని బేలాలో రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక్కడి గ్రామాల ప్రజలను భైంసాలోని పునరావాస శిబిరానికి తరలించారు. భైంసాలోని బైపాస్ రోడ్డు జలమయమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని సుద్దవాగు రిజర్వాయర్ నిండింది. దీంతో ఈ రిజర్వాయర్ ఎనిమిది గేట్లను ఎత్తివేశారు. సాత్నాల రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తివేశారు.