కలిసి పోటీకే కాంగ్రెస్, టిఆర్యస్ల మొగ్గు
హైదరాబాద్/వరంగల్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి ఇష్టపడుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు బుధవారం ఈ విషయాన్ని వేర్వేరుగా వెల్లడించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు నాయని నర్సింహారెడ్డి చెప్పారు. ఇటీవల మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన సంతోష్రెడ్డి, నాయని నర్సింహారెడ్డి ఢిల్లీ వెళ్లి బుధవారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. కాంగ్రెస్తో కలిసి నడవడానికే ప్రాధాన్యం ఇస్తామని నాయని నర్సింహారెడ్డి అన్నారు.
తాము కాంగ్రెస్తో కలిసి నడవడానికే ఇష్టపడుతున్నామని, అందుకే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, తమ నేత కె. చంద్రశేఖర్రావుకు మధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడిపై ముఖ్యమంత్రి తమ అధిష్ఠానవర్గానికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. అందులో తాము చేసేదేమీ లేదని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో తాము తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేయడానికే ఇష్టపడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం వరంగల్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా స్థానికంగా కూడా ఈ పొత్తులు కుదురుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సూచనప్రాయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. తాము పొత్తులతో వచ్చామని, పొత్తులతోనే సాగుతామని ఆయన అన్నారు.