నగరబాటలో వెంకటగిరికి వైయస్ హామీల వర్షం
నెల్లూరు: సోమశిల, తెలుగుగంగ, సువర్ణముఖి ప్రాజెక్టుల కాలువల నిర్మాణం నెల రోజుల్లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు, కావలి, వెంకటగిరిలలో ఆయన బుధవారం రాజీవ్ నగరబాట నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరికి అనేక వరాలు ప్రసాదించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సోమశిల ఉత్తర కాలువను కావలి వరకు పొడిగిస్తామని ఆయన చెప్పారు. మహిళల ఆర్థిక పరిపుష్టికి డ్వాక్రా మహిళలకు వచ్చే ఏడాది పావలా వడ్డీకే 2,200 కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. వెంకటగిరిలోని కళాశాల మైదానంలో డ్వాక్రా మహిళలతో ఆయన మాట్లాడారు.
వెంకటగిరిలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వెంకటగిరిలో 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజీవ్ గృహకల్ప కింద 500 ఇళ్ల నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. డియస్సి 2003 అభ్యర్థులకు నెల రోజుల్లోగా నియామకం ఉత్తర్వులు ఇస్తామని ఆయన చెప్పారు. వెంకటగిరిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆగస్టులో లక్ష ఎకరాల భూమి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని రాజశేఖర్ రెడ్డి కావలిలో చెప్పారు.