ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తాం: జెఎసి
హైదరాబాద్: ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (జె ఎసి) నాయకులు హెచ్చరించారు. రామమోహన్ రావు నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పి ఆర్సి) నివేదిక అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు గురువారం విమర్శించారు. నివేదికను బయటపెట్టకుండా ప్రభుత్వం హైకోర్టు కమిటీని వేయడాన్ని వారు తప్పు పట్టారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను విడివిడిగా ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం విభజించు పాలించు అనే పద్ధతిలో వ్యవహరిస్తోందని వారన్నారు. పి ఆర్సి నివేదికను బయట పెట్టిన తర్వాత దానిపై చర్చించాలని వారన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒకరకంగా, ఎన్నికల తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని వారన్నారు. ప్రభుత్వంతో తమ సమావేశం మూడు సార్లు వాయిదా పడిందని వారు చెప్పారు.