వర్షాలకు మహారాష్ట్రంలో 200 మంది బలి
ముంబాయి: భారీ వర్షాలకు ముంబాయి నగరంలోనూ, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ 200 మందికి పైగా మరణించారు. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోవడంతో గురవారంనాడు సహాయక చర్యలు ముందుకు సాగలేదు. మృతదేహాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. గోడలు కూలడం, కార్లలో ఇరుక్కుపోవడం వంటి అవాంఛనీయ సంఘటనలలో ఒక ముంబాయిలోనే 83 మంది మరణించినట్లు అంచనా. మంగళ, బుధవారాల్లో ఎడతెగని వర్షం వల్ల ముంబాయిలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. టెలిఫోన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది. జాతీయ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విమానాలు కదలేదు.
సాకినాకలో చిన్నపాటి కొండ విరిగి గుడిసెలపై పడడంతో 45 మంది మరణించారు. భారత చరిత్రలోనే ముంబాయిలో అతి పెద్ద వర్షపాతం నమోదైంది. ముంబాయిలో మంగళవారం 94.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారంనాడు కమ్యూనికేషన్ నెట్వర్క్ను పునరుద్ధరించారు. రోడ్డు రవాణా పునరుద్ధరణ పాక్షికంగా జరిగింది. దూరప్రాంతాల రైళ్ల రాకపోకలను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. ముంబాయికి అన్ని విధాలా సహాయం చేస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు.