టిడిపితో స్నేహానికి సిపిఐ షరతులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో తిరిగి స్నేహం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కొన్ని షరుతులు పెడుతోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతో పాటు ప్రపంచ బ్యాంక్ నిర్దేశించే ఆర్థిక విధానాలను అనుసరించబోమని స్పష్టంగా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీతో తిరిగి స్నేహం చేసే విషయాన్ని పరిశీలిస్తామని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ చెప్పారు. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బిల్లుపై వచ్చే నెల 10వ తేదీన జరిగే జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దేశంలో ఏర్పడబోయే తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని, అయితే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుకు తాము ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. సిపియంకు, తమకు మధ్య కొన్ని విభేదాలున్నాయని, ఈ విభేదాలు పరిష్కారమైతే తప్ప విలీనం సాధ్యం కాదని ఆయన అన్నారు.