మంత్రులు క్షమాపణలు చెప్పాలి: టిడిపి డిమాండ్
హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది విషజ్వరాలతో మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్. వేణుగోపాలాచారి, మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఏజెన్సీ మరణాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు కె. రోశయ్య, జక్కంపూడి రామ్మోహన్ రావులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
ఏజెన్సీ మరణాలపై మాట్లాడుతూ మేం కాటికాపరుల్లాగా కాపలా కాయాలా అని జక్కంపూడి రామమోహన్ రావు అడిగారని, దోమలను రాళ్లతో చంపాలని కె. రోశయ్య అన్నారని, బాధ్యతాయుతమైన మంత్రులు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని వారన్నారు. ఎన్నికలకు ముందు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పక్కనే ఊరికి వెళ్లడానికి హెలికాప్టర్ కావాల్సి వచ్చిందని, హెలికాప్టర్ లేక ఏజెన్సీ పర్యటనను వాయిదా వేసుకున్నారని, ఇంటి నుంచి సచివాలయానికి రావడానికి హెలికాప్టర్ కావాల్స వచ్చిందని వారన్నారు. దాన్ని బట్టి రాజశేఖర్ రెడ్డికి ప్రజల మీద ప్రమ లేదని అర్థం చేసుకోవచ్చునని వారన్నారు.