సిపిఐ కొత్త కార్యదర్శి నారాయణ
హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి నూతన కార్యదర్శిగా డాక్టర్ కె. నారాయణ ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన సిపి ఐ సమావేశాల్లో రెండో రోజు ఆదివారం ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సిపిఐ నూతన కార్యదర్శివర్గ ఎన్నిక కూడా ఈ సందర్భంగా జరిగింది. కార్యదర్శివర్గ సభ్యులుగా టి. లక్ష్మీనారాయణ, కె. నారాయణ, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, గుండా మల్లేష్, కె. రామకృష్ణ ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కె. నారాయణ తన ఎన్నిక అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన సురవరం సుధాకర్ రెడ్డి స్థానంలో నారాయణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భావసారూప్యం గల పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ అనుబంధ సంస్థలను పటిష్టం చేయడం ద్వారా వామపక్షాల మధ్య మరింత సాన్నిహత్యానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీతో దూరంగా ఉంటామని, ఆర్థిక విధానాల్లో తెలుగుదేశం తన వైఖరి మార్చుకోనంత వరకు తెలుగుదేశంతో కలిసి పనిచేసే అవకాశం ఉండదని ఆయన చెప్పారు. బిజెపి దూరంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. అయితే ఆచరణలో తెలుగుదేశం పార్టీ బిజెపి వైఖరిని తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.