రాజకీయాల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు: బాబు
కరీంనగర్: మైనారిటీలకు రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన బుధవారం ఉదయం ఉపాధ్యాయుల, మేధావుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింలకు తాము రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు ఒక విధానమంటూ లేదని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్కు మార్గదర్శకత్వం లోపించిందని ఆయన వ్యాఖ్యానించారు. షెడ్యూల్డ్ కులాల ( ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తోందని ఆయన అన్నారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని ఆయన దుయ్యబట్టారు. తాము రూపొందించి అమలు చేసిన జన్మభూమి వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను రద్దు చేసి రాజీవ్ నగరబాట వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని, రాజీవ్నగర బాట ఏమిటో ఎవరికీ అర్థమయ్యేట్లు లేదని ఆయన అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని, ప్రజలు సానుకూల ఓటుకు ప్రాధాన్యం ఇస్తారని ఆయన అన్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ)లో తాము ఎప్పుడూ భాగస్వాములం కాదని, బయటి నుంచి మాత్రమే తాము యన్డి ఎకు మద్దతు ఇచ్చామని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు బయటి నుంచే మద్దతు ఇస్తున్నారని ఆయన చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.