70 శాతం మున్సిపాలిటీలు గెలుస్తాం: కెకె
రాజమండ్రి: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలుస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని మున్పిసాలిటీల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన ఆయన బుధవారం రాజమండ్రిలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 14 నెలలుగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల, తమపై ప్రజలకు ఉన్న విశ్వాసం వల్ల తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు.
కాంగ్రెస్లో భేదాభిప్రాయాలు లేవని, భేదాభిప్రాయాలన్నీ మీడియా సృష్టేనని ఆయన అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ స్థానిక క్యాడర్ మనోభావాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని ఆయన అన్నారు. తాము ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. పొత్తుల కోసం కమ్యూనిస్టులతో తాను మాట్లాడుతానని, వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటేనే తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు. పరోక్ష ఎన్నికలే అసలు ప్రజస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు.