విచారణ తర్వాత వసంతకుమారి డిస్మిస్: ఎస్వీయు
తిరుపతి: వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర ( ఎస్వీ) విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వసంతకుమారిని సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం నేరం రుజువైతే చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ అధికారవర్గాలు చెప్పాయి. వసంతకుమారిని డిస్మిస్ చేయాలని మహిళా సంఘాల కార్యకర్తలు, విద్యార్థులు బుధవారం ఎస్వీయులో ధర్నా చేశారు. వసంతకుమారి ఇంటిలో డియస్పి రాజయ్య సోదాలు నిర్వహించారు. వ్యభిచార కేంద్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉన్నట్లు రాజయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు. వసంతకుమారి ఇంటిలో పోలీసులకు ఎక్కడ చూసినా మద్య సీసాలు, కండోమ్లు కనిపించాయి.
రాజమండ్రి నుంచి వసంతకుమారి వ్యభిచార కేంద్రానికి అమ్మాయిలను సరఫరా చేస్తున్నవారిని కూడా అరెస్టు చేస్తామని రాజయ్య చెప్పారు. విచారణ అనంతరం వసంతకుమారిపై తగిన చర్యలు తీసుకుంటామని, ఈ సంఘటన యూనివర్శిటీకి కూడా మచ్చలాంటిదని యూనివర్శిటీ అధికార వర్గాలు అంటున్నారు.
వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తోందనే ఆరోపణపై పోలీసులు మంగళవారం వసంతకుమారిని అరెస్టు చేశారు. మ్యారేజ్ బ్యూరో ముసుగులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి వసంతకుమారితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వసంతకుమారి విషయంలో మొదట పెద్దయెత్తున ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో వసంతకుమారిపై కేసు పెట్టాలా, వద్దా అనే సంశయంలో పోలీసులు పడ్డారు. చివరకు మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆమె కేసు పెట్టారు. ఎస్వీ యూనివర్శిటీ అడల్డ్ ఎడ్యుకేషన్ విభాగంలో వసంతకుమారి ప్రొఫెసర్గా పని చేస్తోంది.