టిజెయస్ ఏర్పాటుపై చంద్రబాబు మండిపాటు
నిజామాబాద్: వెనకబడిన తరగతుల (బిసి) ఓటర్ల జాబితా తప్పుల తడక అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన తన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం కూడా కొనసాగిస్తున్నారు. బిసి రిజర్వేషన్లను తగ్గించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మన్యం విషజ్వరాల విషయంలో ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా తగిన చర్యలు తీసుకుని గిరిజనులను ఆదుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వంలో కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేయడం విడ్డూరమని ఆయన అన్నారు. టిజెయస్ ఏర్పాటుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ జాగరణ సేన ఏర్పాటును కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమర్థించడం దిగజారుడుతనమని ఆయన వ్యాఖ్యానించారు. టి ఆర్యస్, కాంగ్రెస్ దిగజారిపోయాయని ఆయన విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.