బిసి జనాభా తగ్గింపు మొదటికే మోసం: విహెచ్
హైదరాబాద్: వెనకబడిన తరగతుల జనాభా లెక్కలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదరువుతోంది. బిసీల జనాభాను తగ్గించే ప్రయత్నం చేయడం సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు అన్నారు. అవసరమైతే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసి బిసి జనాభా లెక్కలను సరి చేయాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని, జనాభా లెక్కలను సరిచేయకపోతే మున్సిపల్ ఎన్నికల్లో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. బీసీలకు ఆన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకొని వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ గ్రేటర్ హైదరాబాద్ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు వల్ల పన్నులు పెరుగుతాయని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కావాలని హైదరాబాద్ శాసనసభ్యులు అడిగారా, రంగారెడ్డి శాసనసభ్యులు అడిగారా అని ఆయన ప్రశ్నించారు.