పంటకాలువలో ట్రాక్టర్: 13 మంది మృతి
సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ పంటకాలువలో పడిన దుర్ఘటనలో 13 మంది మరణించి వుంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మంగళవారం రాత్రి మేడపాడులో వివాహానికి హాజరై స్వగ్రామం కుంకుదుర్రు తిరిగి వస్తుండగా సామర్లకోట సమీపంలోని జొన్నలదొడ్డి వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పడిపోయింది. ఆ సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నారు. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. మరణించినవారిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) నవీన్చంద్ చెప్పారు. డ్రైవర్ తమకు లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని, ఈ విషయాన్ని డ్రైవర్ ఒప్పుకున్నాడని ఆయన చెప్పారు. స్టీరింగ్ వదిలి ట్రాక్టర్ తోలుతుండడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు.