నిజాలు త్వరలోనే తెలుస్తాయి: బొత్సా సత్యనారాయణ
విజయనగరం: వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని మార్కెటింగ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. వోక్స్ వ్యాగన్ పేరు వశిష్టవాహన్కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించిన సంఘటనపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిజాలు వెల్లడవుతాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో బొత్సా సత్యనారాయణను భారీ పరిశ్రమల శాఖ నుంచి తప్పించి మార్కెటింగ్ శాఖను అప్పగించిన విషయం తెలిసిందే.
వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ రాష్ట్రానికి తప్పకుండా వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ రాకపోతే అందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో తమంత తామే సిబిఐ విచారణకు ముందుకు వచ్చామని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచారణ జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని ఆయన అన్నారు.